విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తే లక్ష్యం: కలెక్టర్
తలమడుగు, ఆగస్టు 24: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి అవసరమైన సౌకర్యాలను కల్పిస్తూ పాఠశాలలను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు.
సోమవారం తాంసి మండలం కపర్ల గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన “ఆరోగ్య పాఠశాల” కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి, విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం విద్యార్థులకు ఏకరూప దుస్తులను అందజేశారు.
నాణ్యమైన వసతులు.. వేగంగా పనులు
కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలల్లో బాలురు, బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు, డైనింగ్ హాల్స్, తాగునీటి సదుపాయాలు తదితర మౌలిక వసతులను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తూ, పెండింగ్ పనులను కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ అధికారుల సమన్వయంతో వేగంగా పూర్తి చేయాలని సూచించారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణంలో చదువుకునే అవకాశం కల్పించడం ద్వారా వారిని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేర్చాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు.
ప్యాకేజ్డ్ ఫుడ్కు దూరంగా ఉండాలి
విద్యార్థులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు. ప్యాకేజ్డ్ ఫుడ్స్కు పూర్తిగా దూరంగా ఉండి, ఇంటి వద్ద తయారుచేసిన పోషకాహారాన్ని తీసుకోవాలని అన్నారు. పాఠశాలలో అందించే మధ్యాహ్న భోజనం, రాగిజావను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు విద్యార్థుల చదువుపై కూడా సానుకూల ప్రభావం చూపుతాయని తెలిపారు.
స్పోకెన్ ఇంగ్లీష్పై ప్రత్యేక దృష్టి
విద్యార్థుల్లో కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించేందుకు ‘స్పోకెన్ ఇంగ్లీష్’ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థుల మధ్య పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను గుర్తించి సర్టిఫికెట్లతో ప్రోత్సహిస్తామని చెప్పారు.
లెర్నింగ్ ల్యాబ్స్ను సద్వినియోగం చేసుకోవాలి
పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ‘ఖాన్ అకాడమీ’, ‘కోడ్ మిత్ర’ లెర్నింగ్ ల్యాబ్స్, కంప్యూటర్ పీరియడ్స్, లైబ్రరీలను విద్యార్థులు విధిగా వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకుని పోటీ ప్రపంచంలో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు.
పేరెంట్-టీచర్ సమావేశాలకు హాజరుకావాలి
ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే పేరెంట్-టీచర్ సమావేశాలకు తల్లిదండ్రులు, సర్పంచ్లు, వార్డు సభ్యులు తప్పనిసరిగా హాజరై విద్యార్థుల చదువు, ప్రోగ్రెస్ రిపోర్ట్లపై ఉపాధ్యాయులతో చర్చించాలని కలెక్టర్ కోరారు. విద్యార్థుల విద్యాభివృద్ధిలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధుల సమన్వయం కీలకమని తెలిపారు.
విద్యార్థులు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా చదువుపైనే పూర్తి దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. ఉపాధ్యాయుల సూచనలు, తల్లిదండ్రుల సహకారంతో తమ లక్ష్యాలను సాధించి, పాఠశాలతో పాటు ఆదిలాబాద్ జిల్లాను రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు.
పలు అభివృద్ధి పనులకు ప్రారంభం
కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ గది, కిచెన్ గార్డెన్, మరుగుదొడ్లను కలెక్టర్ రాజర్షి షా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. విద్యార్థుల కోసం కల్పించిన సౌకర్యాలను పరిశీలించి వాటి నిర్వహణపై సంబంధిత సిబ్బందికి సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి, డీఆర్డీఓ రవీందర్, పంచాయతీరాజ్ ఈఈ శివరాం, తహసీల్దార్ గణేష్, ఎంపీడీఓ గడ్డం మోహన్ రెడ్డి, ఎంఈఓ శ్రీకాంత్, నాయకులు కౌడాల సంతోష్, సర్పంచ్ గండ్రత్ అరుణ్, ఎంపీఓ అవినాష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆనంద్, ఆత్మ చైర్మన్ నారాయణ, ఏఏపీసీ చైర్మన్ ఇందిరా, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
