ఆగస్టు నుంచి మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ.. లబ్ధిదారులకు కీలక సమాచారం
మన భారత్, హైదరాబాద్:
ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రజలకు ఆహార భద్రత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం మార్గదర్శకాలు పంపినట్లు సమాచారం.
అధికారుల ప్రణాళిక ప్రకారం ఆగస్టు 1వ తేదీ నుంచి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ అధికారులు అన్ని జిల్లాల్లో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. రేషన్ దుకాణాల్లో బియ్యం నిల్వలు, పంపిణీ విధానం, లబ్ధిదారుల వివరాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు.
సాధారణంగా ప్రతి నెల మొదటి 15 రోజుల వరకు మాత్రమే రేషన్ బియ్యం పంపిణీ జరుగుతుంది. అయితే ఈసారి మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి అందించాల్సి ఉండటంతో ఆగస్టు నెలలో 31 రోజులపాటు రేషన్ దుకాణాలు పనిచేసేలా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో లబ్ధిదారులు తమకు కేటాయించిన బియ్యాన్ని సౌకర్యవంతంగా పొందే అవకాశం ఉంటుంది.
మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి అందజేయనున్నందున ఈ-పాస్ యంత్రంలో ప్రతి నెలకు విడివిడిగా ధృవీకరణ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. అందువల్ల ప్రతి రేషన్ కార్డుదారు మూడు సార్లు వేలిముద్ర నమోదు చేయాల్సి ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు. రేషన్ తీసుకునే సమయంలో ఆధార్ అనుసంధానమైన వివరాలు సరిగా ఉండేలా లబ్ధిదారులు ముందుగానే నిర్ధారించుకోవాలని సూచిస్తున్నారు.
ఈ విధానంతో వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలకు ఆహార ధాన్యాల సరఫరా అంతరాయం లేకుండా కొనసాగడంతో పాటు పంపిణీ వ్యవస్థ మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ అంశంపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడిన తర్వాత పూర్తి మార్గదర్శకాలు ప్రకటించే అవకాశం ఉంది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పని చేయుటకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్స్ నియోజకవర్గ ఇన్చార్జి లు మండల రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
