ఆదిలాబాద్ జిల్లాలో పోలీసుల ఉక్కుపాదం
రెండు రోజుల్లో ముగ్గురిపై కేసులు నమోదు.. నిందితుల అరెస్ట్, సెల్ఫోన్లు స్వాధీనం
మన భారత్ ఆదిలాబాద్ జిల్లా:
జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా సోషల్ మీడియాను ఉపయోగించి మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్న వారిపై ఆదిలాబాద్ జిల్లా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. తప్పుడు ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులు, వీడియోల ద్వారా ప్రజల్లో ఉద్రిక్తతలు సృష్టించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ స్పష్టం చేశారు.
గత రెండు రోజుల్లో జిల్లాలో సోషల్ మీడియా దుర్వినియోగానికి సంబంధించి మూడు కేసులు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇచ్చోడ మండలం సిరిచల్మ గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ అబ్దుల్ అజీమ్ ఓ ఘటనకు సంబంధించిన విషయాలను వక్రీకరించి మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వీడియో రూపొందించి వాట్సాప్ స్టేటస్లో పోస్టు చేసినట్లు గుర్తించిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అతని సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.
అదేవిధంగా ఇస్లాంపూర్కు చెందిన యూనుస్ (20) సోషల్ మీడియాలో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలకు కారణమయ్యేలా పోస్టులు ప్రచారం చేసినట్లు గుర్తించి ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అతని వద్ద ఉన్న మొబైల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మరో ఘటనలో ధనోరా (కె) గ్రామపంచాయతీ పరిధిలోని ఇంకారిగూడకు చెందిన జాడి జస్వంత్ (18) గ్రామంలో జరిగిన ఘటనను వక్రీకరించి శాంతిభద్రతలకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు చేసినందుకు ఇంద్రవెల్లి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం, విద్వేషపూరిత సందేశాలు, రెచ్చగొట్టే వీడియోలు ప్రచారం చేయడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. ప్రజలు ఏదైనా సమాచారాన్ని షేర్ చేసే ముందు దాని నిజానిజాలను పరిశీలించాలని సూచించారు.
వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు తమ గ్రూపుల్లో వచ్చే పోస్టులు, వీడియోలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కంటెంట్ కనిపిస్తే వెంటనే తొలగించి సంబంధిత వ్యక్తులను హెచ్చరించాలని సూచించారు. నిర్లక్ష్యం చేస్తే అవసరమైతే గ్రూప్ అడ్మిన్లపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, ప్రజలు శాంతి, సామరస్య వాతావరణాన్ని కాపాడేందుకు సహకరించాలని ఎస్పీ కోరారు. అనుమానాస్పద పోస్టులు లేదా విద్వేషపూరిత సందేశాలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
