మన భారత్, ఆదిలాబాద్
గంజాయి రహిత ఆదిలాబాద్ లక్ష్యంగా పోలీసుల ప్రత్యేక చర్యలు
40 మందికి పరీక్షలు, 10 మందికి పాజిటివ్
డి-అడిక్షన్ సెంటర్లకు తరలించి చికిత్స అందిస్తున్న పోలీస్ శాఖ
గంజాయి రహిత ఆదిలాబాద్ జిల్లా నిర్మాణమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా “యాంటీ డ్రగ్ వీక్” సందర్భంగా జిల్లావ్యాప్తంగా విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
గంజాయి సేవించే వారిని గుర్తించేందుకు జిల్లా పరిధిలోని 20 పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గతంలో గంజాయి కేసుల్లో పట్టుబడిన వ్యక్తులను గుర్తించి గంజాయి టెస్టింగ్ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో మొత్తం 40 మందికి పరీక్షలు చేయగా, 10 మందికి గంజాయి సేవించినట్లు పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.
పాజిటివ్గా వచ్చిన వారిని వైద్య పరీక్షల అనంతరం డి-అడిక్షన్ సెంటర్లకు తరలించి నిపుణుల పర్యవేక్షణలో కౌన్సెలింగ్, చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 39 మంది గంజాయి వ్యసనపరులను డి-అడిక్షన్ సెంటర్లకు తరలించి చికిత్స అందించడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల నిర్మూలనకు కేవలం చట్టపరమైన చర్యలే కాకుండా, వ్యసనానికి గురైన వారికి సరైన చికిత్స అందించి సాధారణ జీవితంలోకి తీసుకురావడం కూడా పోలీస్ శాఖ బాధ్యతగా భావిస్తోందన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై దృష్టి పెట్టాలని సూచించారు.
గంజాయి సాగు, అక్రమ రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు.
గంజాయి రహిత ఆదిలాబాద్ జిల్లా సాధించే వరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు, కౌన్సెలింగ్ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.
