మన భారత్, ఆదిలాబాద్:
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు రోజురోజుకూ మండిపోతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఉదయం ఏడు గంటలకే 35 డిగ్రీల సెల్సియస్కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారు. మధ్యాహ్నం సమయానికి పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది.
మంచిర్యాల జిల్లాలోని వెలగనూరు ప్రాంతంలో 43.8°C, భీమారం మండలంలో 43.7°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదే విధంగా ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలో 43.4°C, ఆదిలాబాద్ జిల్లా సత్నాలలో 43.4°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లా కడెం పెద్దూరులో 41.8°C వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం.
ఈ తీవ్ర ఎండల కారణంగా చిన్నారులు, వృద్ధులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో రహదారులు వెలవెలబోతుండగా, అత్యవసర పనుల కోసం మాత్రమే ప్రజలు బయటకు వస్తున్నారు. వేడి గాలులు (లూ) వీస్తుండడంతో ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వైద్యులు సూచించిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ఎక్కువగా నీరు తాగడం, బయటకు వెళ్లేటప్పుడు తల కప్పుకోవడం, అవసరం లేని ప్రయాణాలు తగ్గించడం వంటి చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. రైతులు కూడా పంటల పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.
ఇంకా కొద్ది రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
