మన భారత్, ఆదిలాబాద్:
మాంగుర్ల MPUPS పాఠశాల అభివృద్ధికి పాఠశాల ఉపాధ్యాయుడు కూకటి రాజన్న ఆదర్శంగా నిలిచారు. పాఠశాల గోడలపై బొమ్మలు, అక్షరాలు, జాతీయ నాయకుల చిత్రాల పెయింటింగ్స్ కోసం రూ.10 వేలను పాఠశాల హెచ్ఎం జే. చంద్రకళకి విరాళంగా అందజేశారు.
గత ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయుడు రాజన్న ఇదే విధంగా రూ.10 వేలు విరాళంగా ఇచ్చిన విషయం గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా గ్రామ యువకులు అందించిన రూ.21 వేల సహకారంతో పాఠశాల ఆవరణలో స్టేజ్ నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అడ లక్మణ్, ఉప సర్పంచ్ మునాఫ్, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు పి. సతీష్, టి. వినోద్ తదితరులు ఉపాధ్యాయుడు రాజన్న చేస్తున్న సేవలను కొనియాడుతూ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. పాఠశాల అభివృద్ధిలో ఉపాధ్యాయుల సేవాభావం విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.
ఇలాంటి సేవా కార్యక్రమాలు గ్రామ విద్యాభివృద్ధికి బలమైన పునాది వేస్తాయని గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
