మన భారత్, ఆదిలాబాద్ : జిల్లా కేంద్రానికి చెందిన సాహితీ వేత్త, అఖిల భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు, సీనియర్ హిందీ ఉపాధ్యాయులు సుకుమార్ పేట్కులే కు నవి ముంబైలో ఘన సన్మానం లభించింది. నవి ముంబైలోని పన్వెల్లో ఆదివారం నిర్వహించిన సాహిత్య సమ్మేళనంలో ఆయనను ప్రత్యేకంగా సత్కరించారు.
కొంకన్ మరాఠి సాహిత్య పరిషత్, పన్వెల్ (నవి ముంబై) పంచశీల్ తరుణ్ మండల్, సావర్గం (ముంబై) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సాహిత్య సమ్మేళనం, పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఈ సన్మానం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో బహుజన సాహిత్యాన్ని తెలుగు, మరాఠి, హిందీ భాషల్లో అనువాదాల ద్వారా ప్రజలకు చేరువ చేయడంలో చేసిన సాహిత్య–సామాజిక సేవలకు గుర్తింపుగా సుకుమార్ పేట్కులేను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ హిందీ, మరాఠీ, ఉర్దూ బహుభాషా కవి మధుబావల్కర్ ను కూడా నిర్వాహకులు మెమెంటో, శాలువా, పూలమాల, బొకేలు అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నవి ముంబై, పన్వెల్కు చెందిన కార్యక్రమ నిర్వాహకులు నాగనాథ్ డోలారే రచించిన ‘మానవతే చే సింహాసన్’, ‘లావణ్య లేని’ అనే రెండు మరాఠీ కవితా సంపుటులను ఆవిష్కరించారు.
ఈ అవార్డులను మానవ హక్కుల సంఘం జాతీయ అధ్యక్షులు శివదాస్ మహాజన్ తదితరులు ప్రధానం చేశారు. పూణేకు చెందిన సత్యశోధక్ రఘునాథ్ ఢోక్ తో పాటు దేశవ్యాప్తంగా ఎంపికైన మొత్తం 14 మంది సాహితీవేత్తలను ఈ కార్యక్రమంలో ఘనంగా సన్మానించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా సుకుమార్ పేట్కులే మాట్లాడుతూ, బహుజన మహనీయుల ఆశయ సాధన కోసం గత 25 ఏళ్లుగా కృషి చేస్తున్న తనకు దేశవ్యాప్తంగా వివిధ సంస్థల ద్వారా లభిస్తున్న గుర్తింపులు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి సన్మానాలు తనను మునుముందు సాహిత్య–సామాజిక రంగాల్లో మరింత బాధ్యతతో పనిచేయడానికి ప్రోత్సహిస్తాయని తెలిపారు.
