ఫోన్ లొకేషన్ ఎప్పుడూ ఆన్నేనా?
యూజర్ల ప్రైవసీకి కొత్త ప్రమాదం పై కేంద్రం ప్రతిపాదన
మన భారత్, స్టేట్ బ్యూరో: దేశ భద్రత, నేర దర్యాప్తు సామర్థ్యాలను బలోపేతం చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయంపై ఆలోచిస్తోంది. స్మార్ట్ఫోన్ల లొకేషన్ సర్వీసులను వినియోగదారులు ఆఫ్ చేయకుండా, ఎల్లప్పుడూ ఆన్లో ఉంచేలా చేయాలని కేంద్రం పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వచ్చినట్లయితే, మొబైల్ వినియోగదారుల ప్రైవసీపై పెద్ద చర్చకు దారితీయనుంది.
ఏ-జీపీఎస్ తప్పనిసరి చేస్తారా?
ప్రస్తుతం టెలికం సంస్థలు నేర దర్యాప్తులో ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కేవలం అంచనా ప్రాంతానికే చేరుకోగలుగుతున్నాయి.
కచ్చితమైన లొకేషన్ను గుర్తించడం కష్టతరం అవుతోంది.
ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI), ప్రభుత్వం తప్పనిసరిగా
ఏ-జీపీఎస్ (Assisted GPS) టెక్నాలజీని శాశ్వతంగా యాక్టివ్లో ఉంచాలని సూచించింది.
ఈ టెక్నాలజీ సెల్యులర్ డేటా + ఉపగ్రహ సిగ్నల్స్ ఆధారంగా అత్యంత ఖచ్చితమైన లొకేషన్ను అందిస్తుంది .
దాంతో నేరస్తుల గుర్తింపు, వెతుకులాట మరింత వేగవంతం అవుతుందని COAI అభిప్రాయం.
టెక్ దిగ్గజాల తీవ్ర వ్యతిరేకత
యాపిల్, గూగుల్, శాంసంగ్ వంటి అంతర్జాతీయ మొబైల్ కంపెనీలు ఈ ప్రతిపాదనకు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి.
వాటి వాదనలు:
- ఇది యూజర్ల ప్రైవసీపై నేరుగా దాడి
- ఎల్లప్పుడూ లొకేషన్ ట్రాక్ చేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన
- వ్యక్తిగత భద్రత, డేటా దుర్వినియోగం ప్రమాదం పెరుగుతుంది
ఈ సంవత్సరం జూలై లోనే ఈ కంపెనీలు కలిసి కేంద్రానికి లేఖ పంపి తమ ఆందోళనలను తెలియజేశాయి.
కేంద్రం ఇంకా తుది నిర్ణయానికి రాలేదు
ప్రతిపాదన ప్రస్తుతం సమీక్ష దశలో ఉంది.
దేశ భద్రత–నేర దర్యాప్తు అవసరాలు మరియు వినియోగదారుల గోప్యత మధ్య సమతుల్యం ఎలా సాధించాలి? అన్న విషయంపై మంత్రిత్వ శాఖల మధ్య చర్చలు జరుగుతున్నాయి.
భవిష్యత్ టెక్ పాలసీలపై ప్రభావం చూపే ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
