⚡ విద్యుత్ షాక్తో రెండు గేదెలు మృతి.. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం పట్ల గ్రామస్తుల ఆగ్రహం!
నష్టపరిహారం ఇవ్వాలని బాధితుడు పల్లె రమేశ్ విజ్ఞప్తి
మన భారత్, మెదక్, నవంబర్ 13: మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కాజీపేట గ్రామంలో విద్యుత్ షాక్ (Current Shock) తగిలి రెండు పాడి బర్రెలు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పల్లె రమేశ్ అనే రైతు తన కుటుంబాన్ని పాడి పాల విక్రయాల ద్వారా పోషించుకుంటూ జీవిస్తున్నాడు. గురువారం ఉదయం బర్రెలను మేపడానికి పొలాలకు తీసుకెళ్లిన రమేశ్కి తీవ్ర విషాదం ఎదురైంది.
పొలంలో లూజ్ అయిన విద్యుత్ తీగలు నేలపై పడి ఉండటాన్ని గమనించక, బర్రెలు వాటికి తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి. ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో రైతు, గ్రామస్తులు పరుగులు తీశారు కానీ అప్పటికే ఆ పశువులు మృతి చెందాయి.
గ్రామస్థుల ప్రకారం, విద్యుత్ తీగలు వదులుగా వేలాడుతున్నాయని పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని, వారి నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని ఆరోపించారు. చనిపోయిన బర్రెల విలువ దాదాపు రూ.2 లక్షలుగా ఉంటుందని బాధితుడు తెలిపాడు.
“ఈ బర్రెలే మా కుటుంబానికి ప్రధాన ఆదాయం. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు,” అని రమేశ్ కంటతడి పెట్టాడు. గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటూ రమేశ్కు తక్షణ నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నారు.
