ఓొఆదిలాబాద్ జిల్లా పోలీసుల ప్రజా ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి
బాధితులకు అండగా నిలవాలి.. ప్రతి ఫిర్యాదుకు న్యాయం చేయాలి : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్
ప్రజా ఫిర్యాదుల విభాగంలో 34 వినతులు స్వీకరణ.. అధికారులకు తక్షణ పరిష్కార ఆదేశాలు
అసాంఘిక కార్యకలాపాలు, మాదకద్రవ్యాలపై సమాచారం ఇవ్వాలని ప్రజలకు పిలుపు
మన భారత్ – ఆదిలాబాద్S
ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పోలీసు శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు. బాధితులకు అండగా నిలిచి వారికి న్యాయం చేయడమే పోలీసుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు.
సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఎస్పీ నేరుగా స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 34 ఫిర్యాదులను స్వీకరించి, ప్రతి బాధితుడి సమస్యను ఓర్పుతో విన్నారు.
అనంతరం సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడిన ఎస్పీ, ఫిర్యాదులపై చట్టపరిధిలో విచారణ చేపట్టి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదురైనా భయపడకుండా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.
ప్రతి ఫిర్యాదును పారదర్శకంగా పరిశీలించి, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు, మాదకద్రవ్యాల విక్రయాలు, అసాంఘిక చర్యలను అరికట్టేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు.
జిల్లాలో ఎక్కడైనా అనుమానాస్పద కార్యకలాపాలు లేదా మాదకద్రవ్యాల సరఫరా గురించి సమాచారం ఉంటే వెంటనే 8712659973 నంబర్కు వాట్సాప్ ద్వారా తెలియజేయాలని కోరారు. సమాచారం అందించే వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీసీ కొండరాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి జైస్వాల్ కవిత, సిబ్బంది సునీల్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
