మన భారత్, ఇచ్చోడ:
నకిలీ సిగరెట్ల విక్రయాన్ని అడ్డుకుని ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసిన ఘటన ఇచ్చోడ మండల పరిధిలోని నేరడిగొండలో వెలుగుచూసింది. ఈ విషయాన్ని ఇచ్చోడ సీఐ రమేశ్ వెల్లడించారు. అక్రమంగా నకిలీ సిగరెట్లను విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించారు.
దాడుల్లో మహ్మద్ సమ్లాని, మండుల పవన్ కుమార్, ఇమ్రాన్ అనే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మరో నిందితుడు పరారీలో ఉండగా, అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. నిందితులు నకిలీ సిగరెట్లను సరఫరా చేసి స్థానికంగా విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.
నిందితుల వద్ద నుంచి రూ.60,400 విలువైన నకిలీ సిగరెట్లు, ఒక ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఎస్సై ఇమ్రాన్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
ప్రజల ఆరోగ్యానికి హానికరమైన నకిలీ ఉత్పత్తులను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందిస్తే వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
నకిలీ వస్తువుల వినియోగం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
