మన భారత్, ఆదిలాబాద్:
తాంసి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన సీఎం కప్ క్రీడా పోటీలు ఉత్సాహంగా ముగిశాయి. మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించారు. విద్యార్థులు, యువత అధికంగా పాల్గొనడంతో క్రీడా మైదానం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.
వివిధ విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు నిర్వాహకులు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీడీవో మోహన్ రెడ్డి మాట్లాడుతూ, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు.
సీఎం కప్ వంటి క్రీడా పోటీలు గ్రామీణ ప్రాంతాల యువ క్రీడాకారులకు మంచి వేదికగా నిలుస్తున్నాయని, భవిష్యత్తులో ఉన్నత స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశాలను కల్పిస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యం ఇస్తూ యువతను ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంతోష్ రెడ్డి, ఎంఈవో శ్రీకాంత్, ఉపాధ్యాయులు, క్రీడా నిర్వాహకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొని పోటీలను విజయవంతం చేశారు.
