మన భారత్, హైదరాబాద్:
పసిడి పరుగులు ఆగడం లేదు. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, డాలర్ మారకపు విలువల్లో హెచ్చుతగ్గులు, భౌగోళిక రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో బంగారం ధరలు రోజురోజుకూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఆల్టైమ్ హైకి చేరాయి.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రిటైల్ ధర 3 శాతం జీఎస్టీతో కలిపి ఏకంగా రూ.1,52,000ను దాటింది. గత కొన్ని రోజులుగా స్వల్పంగా పెరుగుతూ వచ్చిన పసిడి, ఇవాళ ఒక్కసారిగా భారీ ఎగబాకి కొనుగోలుదారులను ఆశ్చర్యానికి గురిచేసింది. పెళ్లిళ్ల సీజన్ దగ్గరపడుతున్న వేళ ఈ ధరలు సామాన్యులపై భారంగా మారుతున్నాయి.

అటు వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టడం లేదు. హైదరాబాద్ మార్కెట్లో వెండి రిటైల్ ధర కిలోకు 3 శాతం జీఎస్టీతో కలిపి రూ.3,39,900 పైనే కొనసాగుతోంది. పరిశ్రమల అవసరాలు, పెట్టుబడిదారుల డిమాండ్ పెరగడం వల్ల వెండి ధరలు కూడా బలంగా నిలుస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ముందు రోజుల్లోనూ బంగారం, వెండి ధరల్లో స్థిరత్వం కష్టమేనని, అంతర్జాతీయ పరిస్థితులపై ఆధారపడి మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పెట్టుబడిదారులు, వినియోగదారులు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
