మన భారత్ ఆదిలాబాద్: ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో వెలిసిన ఆదివాసుల ఆరాధ్యదైవమైన శ్రీ నాగోబా దేవత ఆలయంలో నిర్వహించిన మహా పూజ కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. నాగోబా జాతర సందర్భంగా ఆలయాన్ని దర్శించుకున్న ఆయన, మెస్రం వంశీయుల సంప్రదాయ పద్ధతుల ప్రకారం నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.
మహా పూజ అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అధికారులతో కలిసి ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించి, పూజా కార్యక్రమాల ఏర్పాట్లపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆసియాలోనే రెండవ అతి పెద్ద గిరిజన జాతర మన ఆదిలాబాద్ జిల్లాలో జరగడం జిల్లావాసులకు గర్వకారణమని అన్నారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు తరతరాలుగా కొనసాగుతూ రావడం ప్రశంసనీయమని పేర్కొన్నారు.
నాగోబా జాతర గిరిజన సమాజ ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోందని, ఈ పవిత్ర సంప్రదాయాలను ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు కలిసి కాపాడాల్సిన బాధ్యత ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. జాతర విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్న నిర్వాహకులు, అధికారులు అభినందనీయులని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాయకులు తిరుమల్ గౌడ్, ముండే పాండరంగ్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. నాగోబా మహా పూజ సందర్భంగా కేస్లాపూర్ గ్రామం భక్తులతో కిటకిటలాడింది.
