మేడారం మహాజాతరకు సీఎం రేవంత్ రెడ్డికి ఘన ఆహ్వానం.. అసెంబ్లీలో జాతర పోస్టర్ ఆవిష్కరణ
మన భారత్, తెలంగాణ : ఈ నెల 28 నుంచి ప్రారంభమవుతున్న దేశంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన ఆధ్యాత్మిక వేడుక మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ని ఆహ్వానించారు. ఈ మేరకు మంత్రులు కొండా సురేఖ , ధనసరి అనసూయ సీతక్క , పొంగులేటి శ్రీనివాస రెడ్డి , అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , మేడారం ఆలయ పూజారులతో కలిసి అసెంబ్లీ ఛాంబర్లో ముఖ్యమంత్రి ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా జాతర ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రి కి అందజేశారు. అనంతరం మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతర పోస్టర్ను ముఖ్యమంత్రి అధికారికంగా ఆవిష్కరించారు. ఈ మహాజాతర ఆదివాసీ గిరిజన సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తుందని, కోట్లాది మంది భక్తుల ఆరాధనకు కేంద్రంగా మారిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మేడారం మహాజాతరను ప్రభుత్వం ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రత, మౌలిక వసతులు, రవాణా సౌకర్యాలు మెరుగుపరుస్తామని సీఎం వెల్లడించారు. జాతర విజయవంతానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు.
