💥 అమెరికాలో హైదరాబాద్ యువతి దారుణ హత్య 🗡️
న్యూ ఇయర్ వేడుకల నాడు అదృశ్యమైన నిఖిత… మాజీ ప్రియుడి ఫ్లాట్లో శవమై తేలింది
మన భారత్, హైదరాబాద్ | జనవరి 05
ఉన్నత చదువుల ఆశతో అమెరికా వెళ్లిన హైదరాబాద్ యువతి నిఖిత (26) దారుణ హత్యకు గురికావడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. న్యూ ఇయర్ వేడుకల రోజు అదృశ్యమైన నిఖిత, తన మాజీ ప్రియుడు అర్జున్ శర్మ అపార్ట్మెంట్లో మృతదేహంగా లభ్యమైంది. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది.
మేరీలాండ్ రాష్ట్రంలోని కొలంబియాలో నివసిస్తున్న గోడిశాల నిఖిత గత వారం రోజులుగా కనిపించకుండా పోయింది. న్యూ ఇయర్ వేడుకల తర్వాత నుంచి ఆమె ఆచూకీ తెలియకపోవడంతో స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఇదే సమయంలో ఆమె మాజీ ప్రియుడు అర్జున్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. అయితే ఫిర్యాదు చేసిన కొద్ది రోజుల్లోనే అతడు అమెరికా విడిచి భారత్కు రావడం అనుమానాలకు దారి తీసింది.

జనవరి 2న అర్జున్ అమెరికా నుంచి భారత్కు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. అతడు పరారీలో ఉన్నట్టు భావించిన పోలీసులు సెర్చ్ వారెంట్ జారీ చేసి అతడి అపార్ట్మెంట్ను తనిఖీ చేయగా, అక్కడ నిఖిత మృతదేహం బయటపడింది. నిఖిత శరీరంపై కత్తిపోట్లు ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఆమెను అర్జున్ హత్య చేసినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
నిఖిత కనిపించకపోవడంతో ఆమె స్నేహితురాళ్లు సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తూ ఆచూకీ కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ ఆదివారం ఆమె హత్యకు గురైనట్టు వెల్లడికావడంతో స్నేహితులు, బంధువులు షాక్కు గురయ్యారు. నిఖిత కుటుంబ సభ్యులు సికింద్రాబాద్కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడైన అర్జున్ శర్మపై అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్టు అధికారులు తెలిపారు. అతడిని ఇంటర్పోల్ సహకారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. హత్యకు గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, దర్యాప్తు కొనసాగుతోందని అమెరికా పోలీసులు వెల్లడించారు.
ఉన్నత విద్య కలలతో విదేశాలకు వెళ్లిన యువతుల భద్రతపై మరోసారి చర్చకు దారి తీసిన ఈ ఘటన తెలుగు ప్రజలను తీవ్రంగా కలచివేసింది.
