సాహితీవేత్తలు సుకుమార్ పెట్కులే, మధూ బావల్కర్కు జాతీయ పురస్కారాలు
మన భారత్, మహారాష్ట్ర:
సాహిత్య, సామాజిక రంగాల్లో విశేష సేవలు అందించిన ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ సాహితీవేత్తలు సుకుమార్ పెట్కులే, మధూ బావల్కర్లకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. వీరికి “భారతీయ సవిధాన్ సన్మాన గౌరవ పురస్కారం–2025”ను ప్రదానం చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి, అదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సాహితీవేత్తలకు ఈ గౌరవం దక్కడం విశేషంగా నిలిచింది.
బహుభాషా పండితులు, హిందీ భాషా సేవా సమితి జిల్లా అధ్యక్షులు, అఖిల భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా సేవలందిస్తున్న సుకుమార్ పెట్కులే, అలాగే బహుభాషా కోవిదుడు, రిటైర్డ్ పోస్ట్మాస్టర్, ప్రముఖ కవి మధూ బావల్కర్ సాహిత్యంతో పాటు సామాజిక రంగంలో చేసిన కృషికి గాను ఈ పురస్కారాలు లభించాయి.
ఆదివారం మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా భద్రావతిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డులను అందజేశారు. జాతీయ మానవ హక్కుల సంఘం జాతీయ అధ్యక్షులు శివదాస్ మహాజన్, పూణేకు చెందిన సత్యశోధక్ రఘునాథ్ ఢోక్, సంవిధాన్ సన్మాన గౌరవ సమితి ముఖ్య నిర్వాహకులు ఆనంద్ భగత్ చేతుల మీదుగా పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పంచశీల కండువా, మేమెంటో, ప్రశంసా పత్రాలతో ఇరువురు సాహితీవేత్తలను ఘనంగా సత్కరించారు.
పురస్కారం అందుకున్న అనంతరం సుకుమార్ పెట్కులే, మధూ బావల్కర్లు మాట్లాడుతూ తమ సాహిత్య, సామాజిక సేవలకు ఈ గుర్తింపు రావడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరింత ఉత్సాహంగా సాహితీ సేవ కొనసాగిస్తూ, సమాజ సేవలో బహుజన మహనీయుల బాటలో నడుస్తామని పేర్కొన్నారు.
ఈ పురస్కారాలు ఆదిలాబాద్ జిల్లాకు గర్వకారణమని, స్థానిక సాహిత్య వేదికలకు మరింత ప్రోత్సాహం కలుగుతుందని సాహితీ ప్రేమికులు అభిప్రాయపడ్డారు.
