ఇందిరమ్మ ఇళ్లు.. అనర్హులపై వేటు, లబ్దిదారులకు షాక్
మన భారత్, తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం పేదలందరికీ సొంతిల్లు కల్పించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అనర్హులపై కఠిన చర్యలు చేపట్టింది. అర్హులకే ప్రయోజనం చేకూరాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సమగ్రంగా పరిశీలన చేపట్టి, నిబంధనలకు విరుద్ధంగా ఎంపికైన లబ్ధిదారులను గుర్తించింది.
ఈ పరిశీలనలో సొంత కారు కలిగి ఉన్నవారు, గతంలోనే ప్రభుత్వ సహాయంతో ఇల్లు నిర్మించుకున్నవారు వంటి సుమారు 2,500 మంది అనర్హులుగా తేలినట్లు అధికారులు వెల్లడించారు. వీరికి మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిధులను ప్రభుత్వం తక్షణమే నిలిపివేసింది. ఈ నిర్ణయంతో పథకంలో అక్రమాలు, దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలనే ప్రభుత్వం సంకల్పం స్పష్టమవుతోంది.
పథకాన్ని పూర్తిగా పారదర్శకంగా అమలు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అధికారులు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 3.48 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి, దాదాపు రూ.3,800 కోట్లను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల నిజమైన పేదలకు న్యాయం జరుగుతుందని, అర్హులైన వారికి మాత్రమే ఇళ్ల ప్రయోజనం అందుతుందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. భవిష్యత్తులో కూడా పథకాల అమలుపై కఠిన పర్యవేక్షణ కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
