అట్టహాసంగా బీఆర్ఎస్ నూతన సర్పంచుల సన్మాన సభ
– పండుగలా మెరిసిన బరంపూర్ గ్రామం
మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలో బీఆర్ఎస్ పార్టీ బలపరచిన అభ్యర్థులు ఘన విజయం సాధించిన సందర్భంగా మండలంలోని బరంపూర్ గ్రామంలో అట్టహాసంగా నూతన సర్పంచుల సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పండుగ వాతావరణాన్ని తలపించిన ఈ సభతో బరంపూర్ గ్రామం అంతా ఉత్సాహంతో మెరిసిపోయింది.
సన్మాన కార్యక్రమం ప్రారంభంలో 69 సంవత్సరాల తర్వాత బరంపూర్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్ఎస్ అభ్యర్థి మెస్రం దేవురావు, ఉప సర్పంచ్ రంజిత్ రెడ్డిలను గ్రామ పంచాయతీలో ఘనంగా సన్మానించి, సర్పంచ్ సీటులో కూర్చోబెట్టి అభినందించారు. ఈ ఘనత బరంపూర్ ప్రజల ఐక్యతకు నిదర్శనంగా నిలిచిందని పలువురు పేర్కొన్నారు.

అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 14 మంది నూతన సర్పంచులను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శాలువాలతో సన్మానించి అభినందించారు. సన్మానం పొందినవారిలో తలమడుగు – ఎలుగు చంటి, సుంకిడి – నర్సమ్మ ప్రకాష్, ఖోడద్ – ఎముల ప్రియాంక లక్ష్మా రెడ్డి, కుచులపూర్ – మోడెపు వెంకన్న, చర్లపల్లి – ఆత్రం అంజనీ బాయి అశోక్, లక్ష్మీపూర్ – తొడసం రాధ మనోహర్, అర్లి – నారు లక్ష్మీ, ఉమ్రి – మెస్రం సావిత్రబాయి మనోహర్, పల్సి బి – నైతం లక్ష్మణ్, పల్సి బి తాండ – జాదవ్ ఆర్తి ప్రభు, నందిగామ – మెస్రం భీంరావ్, డోర్లి – గోడం పూజ రవి, దేవపూర్ – పోరండ్ల సంతోష్ ఉన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, మండలంలోని ప్రతి గ్రామ అభివృద్ధి బాధ్యతను తాను తీసుకుంటానని, ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. 69 సంవత్సరాల తర్వాత బరంపూర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందడం ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారనే నిదర్శనమని వ్యాఖ్యానించారు. గిరిజన గ్రామాల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి ప్రజలకు స్పష్టంగా తెలుసని అన్నారు.

రాష్ట్రం ఏర్పడక ముందు మండలంలో తాగునీటి సమస్యలు తీవ్రంగా ఉండేవని, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిషన్ భగీరథ ద్వారా ప్రతి గ్రామానికి తాగునీరు అందించిందని గుర్తు చేశారు. “కేసీఆర్ ఏం చేశారు అని అడిగేవారు హైదరాబాద్కైనా, బరంపూర్కైనా వెళ్లి చూడాలి” అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు, మాజీ సర్పంచులు, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
