తలమడుగులో ఎన్నికల నియమాలు కఠినంగా అమలు
శాంతి–భద్రతల కోసం ప్రత్యేక చర్యలు: ఎస్ఐ డి. రాధిక హెచ్చరిక
మన భారత్, ఆదిలాబాద్ : గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తలమడుగు మండలంలో నియమావళిని తప్పనిసరిగా పాటించాలని ఎస్ఐ డి. రాధిక స్పష్టం చేశారు. ఎన్నికలు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా జరిగేలా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.
ఎన్నికల రోజున పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధిలో, అంతకంటే సున్నితమైన ప్రాంతాల్లో 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో ప్రజలు గుంపులు గుమిగూడదని కఠిన ఆదేశాలు జారీ చేశామని చెప్పారు.
పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, వాటర్ బాటిల్స్, ఇంకు బాటిల్స్, పెన్నులు, ఆయుధాలు, అగ్ని పదార్థాలు పూర్తిగా నిషేధించబడ్డాయని ఆమె హెచ్చరించారు. ఓటర్లు కేవలం గుర్తింపు పత్రాలతో మాత్రమే ప్రవేశించాల్సి ఉంటుదని సూచించారు.
క్యూ లైన్ పద్ధతి తప్పనిసరి..
పోలింగ్ కేంద్రాల వద్ద క్రమశిక్షణ పాటిస్తూ క్యూ లైన్లో నిలబడి ఓటు వేయాలని, పోలీసులకు సహకరించాలని సూచించారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే జరుగుతుందని గుర్తుచేశారు.
సోషల్ మీడియా నిఘా పెంపు..
వాట్సాప్, ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియా వేదికల్లో రెచ్చగొట్టే, అల్లర్లకు దారి తీసే పోస్టులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి ప్రవర్తనపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వివరించారు.
విజయోత్సవ ర్యాలీలపై ఆంక్షలు
ఎన్నికల రోజునే విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం నిషేధం. సంబంధిత అధికారుల అనుమతితో నిర్ణయించిన రోజుల్లోనే ర్యాలీలు చేసుకోవాలని, ర్యాలీల్లో టపాకాయలు పేల్చడాన్ని పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు.
సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్లు నిర్వహిస్తూ ప్రజల్లో నమ్మకం పెంపొందించేందుకు కృషి చేస్తున్నారని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా పోలీస్ వ్యవస్థ అత్యంత కట్టుదిట్టంగా విధులు నిర్వర్తిస్తుందని ఎస్ఐ రాధిక వెల్లడించారు.
ప్రజలు శాంతి–భద్రతలకు సహకరించి, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
