గుడ్ న్యూస్: ఇందిరమ్మ ఇళ్లపై కీలక నిర్ణయం.. త్వరలో లక్ష ఇళ్లకు గృహప్రవేశం
మన భారత్, తెలంగాణ: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం అవుతున్నదని హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం మూడు లక్షల ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉండగా, వీటిలో లక్ష ఇళ్లు త్వరలో గృహప్రవేశానికి సిద్ధమవుతున్నాయని ప్రకటించారు.
అలాగే వచ్చే ఏడాది మార్చి నాటికి మూడు లక్షల ఇళ్ల గృహప్రవేశం పూర్తి చేస్తామని, ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభమవుతుందని వివరించారు. తెలంగాణ సచివాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి కీలక విషయాలను వెల్లడించారు.
అర్బన్ ఇందిరమ్మ ఇళ్లకు కొత్త ప్రణాళికలు
కోర్ అర్బన్ ప్రాంతాల్లో పేదల కోసం ప్రత్యేక గృహ ప్రణాళిక సిద్ధమైందని మంత్రి వెల్లడించారు.
- గ్రౌండ్ ప్లస్ ఫోర్ భవనాలు నిర్మించి ఇళ్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.
- త్వరలో ప్రత్యేక అర్బన్ హౌసింగ్ ప్రణాళికను ప్రకటించనున్నారు.
- ఓఆర్ఆర్ చుట్టుపక్కల ఉన్న భూముల్లో భారీ స్థాయిలో ఇళ్ల నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు.
- ఒక్కో లొకేషన్లో 10,000 ఇళ్లు నిర్మించి ‘నో ప్రాఫిట్ – నో లాస్’ విధానంలో మధ్యతరగతికి ఇళ్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.
- ఈ ప్రణాళికలను గ్లోబల్ సమ్మిట్లో అధికారికంగా ప్రకటించనున్నట్లు వెల్లడించారు.
గత ప్రభుత్వంపై మంత్రి తీవ్ర విమర్శలు
గత కేసీఆర్ ప్రభుత్వంలో హౌసింగ్ శాఖ పూర్తిగా నిర్వీర్యం అయిందని మంత్రి పొంగులేటి విమర్శించారు.
తాము ఆ శాఖను మళ్లీ బలోపేతం చేశామని, గతంలో నిర్మాణం మొదలుపెట్టి వదిలేసిన ఇళ్లను కూడా ఇందిరమ్మ పథకంలో చేర్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.
గ్రామీణ–పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలం లేని నిరుపేదలకు త్వరలో శుభవార్త అందిస్తామని హామీ ఇచ్చారు.
“ఒక విడతలో ఇళ్లు ఇచ్చి చేతులు దులుపుకోం… అర్హులైన ప్రతి పేదకూ ఇల్లు ఇవ్వాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం” అని మంత్రి తెలిపారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై ఘాటైన సమాధానం
హిల్ట్ పాలసీపై మాజీ మంత్రి కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలను మంత్రి పొంగులేటి తీవ్రంగా ఖండించారు.
– “కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు” అని విరుచుకుపడ్డ మంత్రి,
– వారు అధికారంలో ఉండగా ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించారని విమర్శించారు.
– తమ ప్రభుత్వం వినూత్న నిర్ణయాలు తీసుకుంటోందని, కేసీఆర్ హయాంలో జరిగిన తీరును పునరావృతం చేయబోమని స్పష్టం చేశారు.
