బంగ్లాదేశ్లో మళ్లీ హింసా తాండవం.. ఢాకాలో బాంబు దాడులు, లాక్డౌన్ వాతావరణం
మన భారత్,ఢాకా: బంగ్లాదేశ్ మరోసారి హింసకు కేంద్రమైంది. మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాపై విచారణకు వ్యతిరేకంగా అవామీ లీగ్ కార్యకర్తలు చేపట్టిన నిరసనలు ఉధృతమయ్యాయి. శాంతియుతంగా ప్రారంభమైన ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారి, పలు ప్రాంతాల్లో నాటు బాంబు దాడులు, వాహనాల దహనం జరిగాయి.
రాజధాని ఢాకా సహా పలు పట్టణాల్లో నిరసనకారులు రోడ్లపైకి దిగి, ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితులు అదుపు తప్పడంతో పారామిలిటరీ బలగాలు రంగంలోకి దిగాయి. రోడ్లపై భద్రతా సిబ్బంది భారీగా మోహరించడంతో నగరంలో లాక్డౌన్ తరహా వాతావరణం నెలకొంది.
అవామీ లీగ్ కార్యకర్తలు పోలీసులతో ఘర్షణకు దిగగా, కొన్నిచోట్ల రాళ్ల దాడులు, అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అధికారులు ప్రజలను ఇండ్లలోనే ఉండాలని సూచించారు.
ఇక మరోవైపు, బంగ్లాదేశ్లో పార్లమెంటరీ ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగుతాయని ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ మహ్మద్ యూనస్ ప్రకటించారు. ఎన్నికలకు ముందు రాజకీయ అస్థిరత పెరగకుండా చూడాలని అంతర్జాతీయ వర్గాలు బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
