రైతుల ఖాతాల్లో వెంటనే డబ్బులు జమ.. మంత్రి ఉత్తమ్ హామీ
ఖరీఫ్లో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం.. తడిసిన ధాన్యానికీ MSP హామీ
మన భారత్, సూర్యాపేట, నవంబర్ 12:
రైతులకు ఊరటనిచ్చే ప్రకటనతో రాష్ట్ర వ్యవసాయ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందుకు వచ్చారు. ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, “రైతులు చింతించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం మొత్తం ధాన్యాన్ని ఎంఎస్పీతోపాటు క్వింటాల్కు రూ.500 బోనస్తో కొనుగోలు చేస్తుంది. డబ్బులు 48 నుంచి 72 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ అవుతాయి,” అని మంత్రి ఉత్తమ్ తెలిపారు.
తుఫాను కారణంగా తడిసిన లేదా తేమ ఉన్న ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. “రైతుల కష్టానికి విలువ ఇచ్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. దేశంలో ఒకే పంట సీజన్లో ఇంత భారీ స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసిన రాష్ట్రం తెలంగాణే,” అని ఉత్తమ్ గర్వంగా పేర్కొన్నారు.
అధికారులు రైతుల నుండి ధాన్యం సకాలంలో కొనుగోలు చేసి, నిల్వ సదుపాయాలు సమృద్ధిగా ఉన్నాయనే విషయాన్ని మంత్రి సమీక్షించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
