బెట్టింగ్ యాప్స్ కేసులో మరో దశ.. నేడు సీఐడీ విచారణకు హాజరుకానున్న నటుడు ప్రకాశ్ రాజ్
విజయ్ దేవరకొండ విచారణ తర్వాత సీఐడీ దృష్టి సీనియర్ నటుడిపై
మన భారత్,హైదరాబాద్, నవంబర్ 11:బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు వేడెక్కుతోంది. ఈ కేసులో నోటీసులు అందుకున్న ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ నేడు సీఐడీ విచారణకు హాజరుకానున్నారు. అక్రమ బెట్టింగ్ యాప్స్కు ప్రచారం చేసిన వారిపై సీఐడీ దర్యాప్తు కొనసాగిస్తోంది.
ఇక నిన్న ఈ కేసులో నటుడు విజయ్ దేవరకొండను సుమారు గంట పాటు అధికారులు విచారించారు.
బ్యాన్ చేసిన యాప్స్కి ప్రమోషన్ ఎందుకు ఇచ్చారు? ఆ యాప్స్తో ఏవైనా ఒప్పందాలు ఉన్నాయా? అందుకున్న రెమ్యునరేషన్ ఎంత?
అనే అంశాలపై అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.
విజయ్ దేవరకొండ విచారణలో తన వద్ద ఉన్న ఓప్పంద పత్రాలు, పన్ను వివరాలు, చెల్లింపు ఆధారాలు సమర్పించి తాను చట్టబద్ధంగా A23 యాప్ను మాత్రమే ప్రమోట్ చేశానని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
ఇక నేడు ప్రకాశ్ రాజ్ విచారణలో కూడా సీఐడీ అధికారులు యాప్స్ ప్రమోషన్ ఒప్పందాలు, చెల్లింపుల మార్గాలు, ప్రమోషన్ వీడియోల వివరాలపై కీలక ప్రశ్నలు అడగనున్నారని సమాచారం.
