వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో విషాదం – భార్య, కూతురు సహా ముగ్గురిని హత్య చేసి ఉరివేసుకున్న వ్యక్తి
మన భారత్, వికారాబాద్ | నవంబర్ 2: వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలో ఆదివారం ఉదయం భయానక సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు విషాదాంతానికి దారితీశాయి. స్థానికుడు వేపురి యాదయ్య (35) తన భార్య అలివేలు (31), ఇద్దరు కూతుళ్లు అపర్ణ (13), శ్రావణి (10), అలాగే వదిన హనుమమ్మ (40) పై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో అలివేలు, శ్రావణి, హనుమమ్మ మృతిచెందగా, పెద్ద కుమార్తె అపర్ణ తప్పించుకొని ప్రాణాలు రక్షించుకుంది.
తరువాత యాదయ్య మానసిక ఆవేదనతో తానే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. గ్రామం అంతా ఈ ఘటనతో విషాదంలో మునిగిపోయింది.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం కుటుంబ సమస్యలే ఈ దారుణానికి కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది.
