మంగళూరులో సంచలన సంఘటన — ప్రజలు, పోలీసులు ఆశ్చర్యంలో!
మన భారత్, స్టేట్ బ్యూరో: కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు నగరంలో ఓ ఆశ్చర్యకర సంఘటన వెలుగుచూసింది. చెత్త కుప్పల దగ్గర సంవత్సరాలుగా నివసిస్తున్న ఓ యాచకురాలి దగ్గర లక్షల రూపాయల నగదు బయటపడటంతో ప్రాంతమంతా కలకలం రేగింది.
సమాచారం ప్రకారం, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆ మహిళ గత 13 ఏళ్లుగా నగరంలోని ఒక వీధి మూలలో చెత్త కుప్పల మధ్యే జీవిస్తోంది. స్థానికులు ఆమెను సురక్షిత స్థలానికి తరలించాలనే నిర్ణయంతో ముందుకొచ్చారు. అయితే ఆమె చేతిలో ఉన్న కొన్ని సంచులను గట్టిగా పట్టుకుని వదలకపోవడంతో అనుమానం కలిగింది.
ఆ సంచులను బలవంతంగా తెరిచి చూశే సరికి అందరూ షాక్ అయ్యారు. అందులో పాత నోట్లు, కొత్త నోట్లు, నాణేలు కలిపి భారీ మొత్తంలో డబ్బు కనిపించింది. స్థానికులు లెక్కించగా ఆ మొత్తము ఒక లక్ష రూపాయల కంటే ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
వెంటనే ఈ విషయం పోలీసులకు తెలియజేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు. యాచకురాలిని వైద్య పరీక్షల అనంతరం స్థానిక అనాథ శరణాలయానికి తరలించారు.
ప్రాంత ప్రజలు ఆశ్చర్యపోతూ — “ఎక్కడినుంచి ఈ డబ్బు వచ్చింది..? ఆమెకు ఎవరు ఇచ్చారు..? లేదా ఏదైనా కాలంగా భిక్షాటన ద్వారా సేకరించిందా?” అని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
పోలీసులు ప్రస్తుతం ఆ నగదు మూలం గురించి విచారణ ప్రారంభించారు. ఈ సంఘటనతో మంగళూరు నగరంలో పెద్ద చర్చ మొదలైంది.
