లంబాడా ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వాలంటూ గిరిజన విద్యార్థి సంఘం ఆగ్రహం
మన భారత్, నిజామాబాద్ :
తాజా మంత్రివర్గ విస్తరణలో లంబాడా సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని గిరిజన విద్యార్థి సంఘం మండిపడింది. జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు జాదవ్ ప్రవీణ్ నాయక్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి లంబాడా ఓట్లు కీలక పాత్ర పోషించాయని గుర్తు చేశారు. అయితే, ఆ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వకపోవడం సిగ్గుచేటు చర్య అని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం గిరిజన వర్గాల మధ్య విభజన సృష్టించే విధంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ, మాజీ ఎంపీలు సోయం బాబురావు, తెల్లం వెంకట్రావు లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలంటూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్పై ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించకపోవడం విచారకరమని అన్నారు. ఈ అంశంపై తక్షణ చర్యలు తీసుకుని లంబాడా సమాజానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం సామాజిక న్యాయం సూత్రాన్ని పాటించి, లంబాడా వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో తగిన స్థానం ఇవ్వాలని గిరిజన విద్యార్థి సంఘం కోరింది. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను ప్రారంభించనున్నట్లు హెచ్చరించింది.
కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కోర్ర బన్నీ నాయక్, ఇతర గిరిజన నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
