మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 28: తాంసి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం అదనపు కలెక్టర్ సోమ రాజేశ్వర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలో జరుగుతున్న విద్యా కార్యకలాపాలు, మధ్యాహ్న భోజన పథకం నాణ్యత, పరిసరాల పరిశుభ్రతను సమీక్షించారు. విద్యార్థులతో మాట్లాడిన అదనపు కలెక్టర్, వారి హాజరు వివరాలు, చదువుపై ఆసక్తి, బోధన విధానాలను తెలుసుకున్నారు. పాఠశాల సిబ్బందిని విద్యార్థుల శ్రేయస్సు, పాఠశాల పరిశుభ్రత, భద్రత అంశాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించిన ఆయన, భోజనం నాణ్యత మెరుగుపరచాలని, పిల్లలకు పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల పరిసరాల్లో అసాంఘిక చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, పిల్లల చదువు, హాజరుపై శాశ్వతంగా దృష్టి పెట్టండి” అని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులు, ఎంఈవో శ్రీకాంత్ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
