శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి అలంకరణ ఉత్సవంలో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి
మన భారత్, వనపర్తి: ప్రఖ్యాత శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి ఆలయంలో అలంకరణ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఆలయ ఆచారాల ప్రకారం స్వామి వారికి పట్టు వస్త్రాలను మంత్రి సమర్పించారు. అమరచింత మండల కేంద్రం నుండి లాంచనంగా పట్టు వస్త్రాలను ఆలయ కమిటీకి మంత్రి వాకిటి శ్రీహరి అందజేశారు. అనంతరం ఆత్మకూరు మండలంలోని ఎస్బీఐ బ్యాంకులో భద్రపరిచిన స్వామి వారి ఆభరణాలను స్వీకరించి, ఆత్మకూరు పట్టణం నుండి భక్తుల ఊరేగింపుగా అమ్మాపూర్ గ్రామం వరకు తీసుకెళ్లారు. అక్కడ ఆభరణాలను ఆలయ దొరకు అధికారికంగా అందజేశారు.స్వామి వారిని పట్టు వస్త్రాలు, ఆభరణాలతో భక్తి పరవశంగా అలంకరించనున్నారు. మంత్రి వాకిటి శ్రీహరి ఉత్సవాల్లో పాల్గొనడంతో స్థానిక కాంగ్రెస్ నాయకులు, భక్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు అరవింద్ రెడ్డి, నాగరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. భక్తుల నినాదాలతో ఆలయ ప్రాంగణం ప్రతిధ్వనించింది.
