908 కేజీల గంజాయి పట్టివేత — రూ.2.7 కోట్ల విలువైన మత్తు పదార్థం స్వాధీనం, ముగ్గురు అరెస్ట్
మన భారత్, హైదరాబాద్,: మహా నగరంలోని బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పక్కా సమాచారంతో సోదాలు నిర్వహించి, 908 కిలోల డ్రై గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని మార్కెట్ విలువ సుమారు రూ.2.7 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు.
ఈ సందర్భంగా సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్ మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. అంతర్రాష్ట్ర స్థాయిలో గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు బట్టబయలు చేశారని తెలిపారు. ఒడిశాలోని మల్కన్గిరి ప్రాంతం నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర నాసిక్ వైపు గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు.
ఈ కేసులో ప్రధానంగా ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారిలో
- A1 మొహమ్మద్ కలీం ఉద్దీన్ (డ్రైవర్/ట్రాన్స్పోర్టర్)
- A2 షేక్ సోహైల్
- A3 మొహమ్మద్ అఫ్జల్ @ అబ్బు
ఉన్నారని వెల్లడించారు.
హైదరాబాద్కు చెందిన రహమాన్, ఒడిశాకు చెందిన జిథు, శ్రీకాకుళానికి చెందిన సురేష్, మహారాష్ట్రకు చెందిన మహేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు కొనసాగుతోందని చెప్పారు.
డీసీపీ చైతన్య కుమార్ మాట్లాడుతూ — “సురేష్ మరియు జిథు ఒడిశాలోని మారుమూల అటవీ ప్రాంతంలో గంజాయిని కొనుగోలు చేసి, మహారాష్ట్రకు రవాణా చేసే ప్లాన్ రూపొందించారు. ఈ సరఫరాలో రహమాన్ ప్రధాన రవాణాదారుడిగా వ్యవహరించాడు. మహేష్ గంజాయి రిసీవర్గా ఉన్నాడు. ఒక్క ట్రిప్కు రూ.3 నుండి 5 లక్షల వరకు పారితోషికం ఇస్తానని సురేష్ రెహమాన్కు ఆఫర్ ఇచ్చాడు” అని తెలిపారు.
ఐషర్ డీసీఎం ట్రాన్స్పోర్ట్ వాహనం, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితులు గంజాయిని 28 హెచ్డీపీఈ సంచుల్లో నింపి, వాటిని జీడిపప్పు సంచుల కింద దాచిపెట్టి టార్పాలిన్తో కప్పి రవాణా చేస్తున్నారని చెప్పారు.
హైదరాబాద్ మీదుగా నాసిక్ వైపు తరలించే ప్రయత్నంలో బండ్లగూడ వద్ద పోలీసులకు చిక్కారని తెలిపారు. నిందితులంతా చిన్ననాటి స్నేహితులుగా ఉన్నారని దర్యాప్తులో బయటపడిందని చైతన్య కుమార్ వెల్లడించారు.
పోలీసులు ప్రస్తుతం పరారీలో ఉన్న ప్రధాన నిందితులపై గాలింపు చర్యలు వేగవంతం చేశారు. ఈ ఘటనతో మరోసారి అంతర్రాష్ట్ర గంజాయి రవాణా ముఠాల ఉనికి వెలుగులోకి వచ్చింది.
