కచ్చికంటి గ్రామంలో చలి నివారణకు దుప్పట్ల పంపిణీ – మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ సేవాభావం
మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా లోని కచ్చికంటి గ్రామంలో మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. చలికాలంలో పేదలు, వృద్ధులు ఎదుర్కొనే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ అధ్యక్షులు తోట శివన్న, ప్రధాన కార్యదర్శి బొల్లు ఈశ్వర్ దాస్, కచ్చికంటి గ్రామ అధ్యక్షుడు చుక్క బొట్ల రవితో పాటు గ్రామానికి చెందిన మున్నూరు కాపు కుల బాంధవులు పాల్గొన్నారు. అవసరమైన వారికి దుప్పట్లు అందజేసి, చలితో బాధపడుతున్న కుటుంబాలకు భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా సొసైటీ నాయకులు తోట శివన్న మాట్లాడుతూ, సేవా భావంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా చలికాలంలో పేదల పట్ల మానవీయ దృక్పథంతో ముందుకు రావడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
గ్రామస్తులు మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి సేవలు మరువలేనివి అని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని కోరారు. ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కచ్చికంటి గ్రామంలో సామాజిక ఐక్యతకు నిదర్శనంగా నిలిచిందని స్థానికులు అభిప్రాయపడ్డారు.
