🍾 వైన్ షాప్ వచ్చింది…! ఉద్యోగం పోయింది..!
మహబూబ్నగర్ జిల్లాలో పీఈటీ సస్పెన్షన్ కలకలం
మన భారత్, మహబూబ్నగర్ జిల్లా:
వైన్షాప్ లక్కీ డిప్లో అదృష్టం దక్కిందనుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు చివరికి ఉద్యోగాన్నే కోల్పోయిన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటు చేసుకుంది.
రాంనగర్ బాలికల ఉన్నత పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న పుష్ప భర్త ఇటీవల మద్యం టెండర్ వేసి ధర్మపూర్ వైన్షాప్ లక్కీ డ్రాలో దక్కించుకున్నారు. ఈ క్రమంలో పుష్ప స్వయంగా అధికారుల సమక్షంలో సంతకం చేసి సంబంధిత పత్రాల ప్రక్రియను పూర్తి చేశారు.
అయితే ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా ఉపాధ్యాయులు మద్యం వ్యాపారం లేదా టెండర్లలో పాల్గొనరాదని ప్రభుత్వ నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో టెండర్లు ఖరారైన రోజునే ఒక వ్యక్తి ఆమెపై అధికారులకు ఫిర్యాదు చేశాడు.
ఈ విషయం మీడియా, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు తక్షణమే దృష్టి సారించారు. జిల్లా విద్యాశాఖ అధికారి ప్రవీణ్కుమార్ ఆధ్వర్యంలో విచారణ జరిపారు. పుష్ప మద్యం టెండర్ల దాఖలు నుంచి షాపు దక్కేవరకు చేసిన చర్యలకు సంబంధించిన అన్ని ఆధారాలు సేకరించి నివేదికను సిద్ధం చేశారు.
పరిశీలన అనంతరం విద్యాశాఖాధికారి పీఈటీ పుష్పను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనతో ఉపాధ్యాయ వర్గాల్లో కలకలం రేగింది.
గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ — “ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మద్యం వ్యాపారం చేయడం తగదు. ఇలాంటి ఘటనలు పాఠశాల ప్రతిష్టను దెబ్బతీస్తాయి” అని వ్యాఖ్యానించారు.
