మహబూబ్నగర్ విద్యానిధికి టీజీవో రూ.7.50 లక్షల విరాళం — ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో చెక్కు అందజేత
మన భారత్, మహబూబ్నగర్: విద్యార్థుల భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసిన మహబూబ్నగర్ విద్యానిధికి తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) రూ.7.50 లక్షల విరాళం అందజేసింది. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ విరాళం చెక్కును జిల్లా కలెక్టర్ విజయేందిరబోయికి అందజేశారు.
ఈ కార్యక్రమానికి మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీజీవో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాచర్ల రామకృష్ణగౌడ్, జిల్లా అధ్యక్షుడు విజయ్కుమార్, కార్యదర్శి వరప్రసాద్, టైటస్ పాల్ తదితరులు పాల్గొన్నారు. అదే కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మన్ యాదవ్ తన మొదటి నెల జీతం రూ.1 లక్ష చెక్కును విద్యానిధికి విరాళంగా అందించారు.
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, “సామాజిక బాధ్యతగా భావించి విద్యార్థుల అభ్యున్నతికి విరాళాలు అందించడం ప్రశంసనీయం. టీజీవో సంఘం సమాజానికి ఆదర్శంగా నిలుస్తోంది,” అని అన్నారు. ఆయన టీజీవో ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందించారు.
టీజీవో రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ, “ఈ విరాళం ద్వారా వివిధ శాఖల అధికారులు విద్యానిధికి సహకరించారు. ఇంటర్మీడియట్ అధ్యాపకులు, ప్రిన్సిపల్స్ రూ.2.50 లక్షలు, ఇరిగేషన్ శాఖ రూ.1.25 లక్షలు, వైద్యారోగ్య శాఖ రూ.87 వేల రూపాయలు, మిషన్ భగీరథ రూ.81 వేల రూపాయలు, వెటర్నరీ శాఖ రూ.50 వేల రూపాయలు, వ్యవసాయ శాఖ రూ.40 వేల రూపాయలు, సహకార శాఖ రూ.16 వేల రూపాయలు అందజేశారు” అని వివరించారు.
ఈ కార్యక్రమంలో టీజీవో నాయకులు శ్రీనుగౌడ్, డా.శశికాంత్, జిల్లా ట్రెజరీ అధికారి శ్రీనివాస్, ఏటీవో తానాజీ, పశుసంవర్ధక శాఖ అధికారి మధుసూదన్ గౌడ్, వ్యవసాయ శాఖ ఏడీ రాంపాల్, డీపీఆర్వో శ్రీనివాస్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయేందిరబోయి విద్యానిధి లక్ష్యాలను వివరించి, “ఇలాంటి విరాళాలు విద్యా అభివృద్ధికి తోడ్పడతాయి. అధికారులు చూపిన సేవా భావం ప్రశంసనీయం,” అని అన్నారు.
