manabharath.com
Newspaper Banner
Date of Publish : 18 May 2026, 4:04 pm Editor : manabharath

కోళ్ల ఫారం అగ్నికి ఆహుతి.. రూ.2.70 లక్షల ఆస్తి నష్టం

మన భారత్, విజయనగరం జిల్లా:
విజయనగరం జిల్లా మెంటాడ మండలం జక్కువ గ్రామంలో సోమవారం జరిగిన అగ్నిప్రమాదంలో కోట అప్పడు కు చెందిన కోళ్ల ఫారం పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో సుమారు రూ.2 లక్షల 70 వేల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితుడు తెలిపాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఫారం మొత్తం అగ్నికి ఆహుతై గ్రామంలో ఆందోళన వాతావరణం నెలకొంది.

స్థానికుల సమాచారం మేరకు గజపతినగరం ఫైర్ స్టేషన్ ఎస్సై రవి ప్రసాద్ తన సిబ్బందితో వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మంటలు మరింత వ్యాపించకుండా అప్రమత్తంగా వ్యవహరించి అగ్నిని అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే కోళ్ల ఫారం భారీగా దగ్ధమై నష్టం వాటిల్లింది.

ఫైర్ అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం సమీపంలోని పొలంలో ఎవరైనా చెత్త లేదా ఎండిన గడ్డి కాల్చేందుకు నిప్పు పెట్టడంతో వచ్చిన నిప్పు రవ్వలు గాలికి ఎగిరి కోళ్ల ఫారంపై పడటంతో ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

అగ్నిప్రమాదం కారణంగా బాధిత రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. కష్టపడి ఏర్పాటు చేసుకున్న కోళ్ల ఫారం ఒక్కసారిగా అగ్నికి ఆహుతవడంతో జీవనాధారం కోల్పోయిన పరిస్థితి ఏర్పడిందని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. బాధితుడిని ప్రభుత్వం ఆదుకుని నష్టపరిహారం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

వేసవి కాలంలో ఎండలు, వడగాలుల కారణంగా ఇలాంటి అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో రైతులు, పౌల్ట్రీ ఫారం యజమానులు అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక శాఖ అధికారులు సూచించారు. పొలాల్లో నిర్లక్ష్యంగా మంటలు వేయడం వల్ల పెద్ద ప్రమాదాలు సంభవించే అవకాశముందని హెచ్చరించారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..