manabharath.com
Newspaper Banner
Date of Publish : 18 May 2026, 1:40 pm Editor : manabharath

పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి: మాజీ ఎమ్మెల్యే

ధరల పెంపుపై వైసీపీ భారీ నిరసన ర్యాలీ..

ప్రజలపై భారం మోపొద్దని ప్రభుత్వానికి హెచ్చరిక

మన భారత్, గజపతినగరం:

రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపును వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతుందని మాజీ ఎమ్మెల్యే, గజపతినగరం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త శ్రీ బొత్స అప్పలనరసయ్య హెచ్చరించారు. సోమవారం గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీ ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద ప్రారంభమై తహసీల్దార్ కార్యాలయం వరకు కొనసాగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని పెరిగిన ఇంధన ధరలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా బొత్స అప్పలనరసయ్య మాట్లాడుతూ, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రవాణా ఖర్చులు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా అమాంతం పెరిగిపోయి ప్రజల జీవన వ్యయం భారంగా మారిందన్నారు. రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారులు ఈ ధరల పెంపుతో తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు.

ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పక్కనబెట్టి ఆదాయ వనరుల కోసం ప్రజలపై అదనపు భారాన్ని మోపడం సరైంది కాదని మండిపడ్డారు. ధరలను వెంటనే తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు.

అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేసి, ప్రజల ఆందోళనలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.

మంత్రి శ్రీనివాస్ వ్యాఖ్యలకు కౌంటర్

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలకు బొత్స అప్పలనరసయ్య ఘాటుగా స్పందించారు. గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేస్తూ, “నాడు-నేడు కార్యక్రమం, ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి, ప్రభుత్వ కళాశాలల మౌలిక సదుపాయాల పెంపు, బైపాస్ రోడ్ల నిర్మాణం ఇవి అభివృద్ధి కాదా?” అని ప్రశ్నించారు.

ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన గత ప్రభుత్వాన్ని విమర్శించడం కూటమి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికేనని ఆరోపించారు. ప్రజలు ఇక మాయమాటలను నమ్మే పరిస్థితిలో లేరని, వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుంటున్నారని అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సమస్యలపై వైసీపీ పోరాటం కొనసాగిస్తుందని, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఐదు మండలాల నుంచి ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, యూత్ నాయకులు, రైతు సంఘం ప్రతినిధులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, సోషల్ మీడియా సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైసీపీ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..