manabharath.com
Newspaper Banner
Date of Publish : 16 May 2026, 9:50 am Editor : manabharath

పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత

మన భారత్, చీపురుపల్లి:

పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, చీపురుపల్లి నియోజకవర్గాన్ని వందశాతం ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగాలని చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళావెంకటరావు పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నిర్వహిస్తున్న “స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర” కార్యక్రమంలో భాగంగా “ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్” అనే ప్రత్యేక థీమ్‌తో చీపురుపల్లి హెడ్‌క్వార్టర్స్‌లో భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం వల్ల భూమి, నీరు, గాలి కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంటోందని అన్నారు. అధికారులు జరిమానాలు విధిస్తారనే భయంతో కాకుండా, భవిష్యత్తు తరాల ఆరోగ్యం కోసం ప్రజలు స్వచ్ఛందంగా ప్లాస్టిక్ వినియోగాన్ని మానుకోవాలని సూచించారు. ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించాల్సిన అవసరం ఉందన్నారు. వాటి స్థానంలో పర్యావరణ హితమైన పేపర్ బ్యాగులు, క్లాత్ బ్యాగులు ఉపయోగించాలని కోరారు.

ప్లాస్టిక్ రహిత లక్ష్య సాధన కోసం ఇప్పటికే నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేపట్టామని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో అవగాహన ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో సిబ్బందితో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలపై విస్తృత ప్రచారం చేపట్టనున్నట్లు వెల్లడించారు.

పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. వ్యాపారవేత్తలు, యువత, మహిళలు, విద్యార్థులు కలిసి పనిచేస్తేనే ప్లాస్టిక్ రహిత చీపురుపల్లి లక్ష్యం సాధ్యమవుతుందని అన్నారు. సమాజం ఆరోగ్యంగా ఉండాలంటే ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సచివాలయ ఉన్నతాధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు, యువత, మహిళలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్లాస్టిక్ నిర్మూలనపై నినాదాలు, అవగాహన కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..