మన భారత్, ఆదిలాబాద్:
తాంసి మండలంలోని మారుమూల ఆదివాసీ గ్రామం ఆట్నంగూడలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శుక్రవారం మండుటెండను లెక్కచేయకుండా పర్యటించారు. మిట్ట మధ్యాహ్న సమయంలో గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు గ్రామ ఆదివాసులు బ్యాండు మేళాలతో ఘన స్వాగతం పలికారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన సవారీ షెడ్డును ఎమ్మెల్యే ప్రారంభించి గ్రామ ప్రజలతో మమేకమయ్యారు.
ఎమ్మెల్యే గ్రామంలో అడుగుపెట్టగానే ఆదివాసీ మహిళలు, యువకులు సంప్రదాయ వాద్యాలతో స్వాగతం పలకడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రామ ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఓర్పుగా విని పరిష్కారానికి హామీ ఇచ్చారు. మారుమూల ప్రాంతంలో ప్రజల మధ్యకు వెళ్లిన ఎమ్మెల్యే పర్యటన స్థానికుల్లో ఉత్సాహాన్ని నింపింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ “నా ప్రజల పిలుపే నాకు ముఖ్యం. ప్రజల కోసం ప్రకృతిని కూడా లెక్క చేయను. పిలిచిన ప్రతి పిలుపుకు తప్పకుండా స్పందిస్తాను” అని అన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకోవడం తన బాధ్యతగా భావిస్తున్నానని పేర్కొన్నారు. మారుమూల గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయడమే తన లక్ష్యమని చెప్పారు.
ఆట్నం గూడ గ్రామ ప్రజల కోరిక మేరకు రూ.10 లక్షల వ్యయంతో సవారీ షెడ్డు నిర్మాణం చేపట్టినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. గ్రామస్తులు ఎన్నికల సమయంలో గ్రామాన్ని ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని కోరిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఇచ్చిన హామీ మేరకు గ్రామాన్ని పంచాయతీగా ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకున్నానని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని దశల వారీగా నెరవేర్చుతానని హామీ ఇచ్చారు.
గ్రామంలో తాగునీరు, రహదారులు, విద్య, ఆరోగ్య సదుపాయాలపై గ్రామస్తులు ఎమ్మెల్యేకు వినతులు అందజేశారు. ప్రతి సమస్యను గుర్తించి సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అభివృద్ధిలో మారుమూల గ్రామాలు వెనుకబడకుండా చూడటం ప్రజా ప్రతినిధిగా తన బాధ్యత అని అన్నారు.
గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామానికి ఎమ్మెల్యే రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని, గ్రామానికి అభివృద్ధి తీసుకువస్తున్నారని కొనియాడారు. ప్రత్యేకంగా గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయడం తమకు ఎంతో ఉపయోగకరంగా మారిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల కన్వీనర్ కృష్ణ రత్న ప్రకాష్, సర్పంచ్ ఆత్రం సంజీవ్, మండల స్థాయి నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే పర్యటనతో అట్నంగూడ గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామ ప్రజలతో కలిసి ఎమ్మెల్యే గడపడం స్థానికులను ఆకట్టుకుంది.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
