manabharath.com
Newspaper Banner
Date of Publish : 15 May 2026, 7:01 am Editor : manabharath

అలెర్ట్.. ఆ సమయంలో బయటకు రావద్దు

45 డిగ్రీలు దాటే అవకాశం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

తీవ్రమైన వడగాల్పులపై వాతావరణ శాఖ హెచ్చరిక

మన భారత్, ఉమ్మడి ఆదిలాబాద్ :
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతుండగా, రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

తీవ్రమైన ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండటంతో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.

వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావంతో వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వడదెబ్బ బారిన పడకుండా తరచూ నీరు తాగడం, చల్లని ద్రవాలు తీసుకోవడం, తలపై గుడ్డ లేదా టోపీ ధరించడం మంచిదని పేర్కొన్నారు.

వ్యవసాయ కూలీలు, నిర్మాణ కార్మికులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు ఉదయం, సాయంత్రం సమయాల్లో పనులు నిర్వహించాలని అధికారులు సూచించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు.

జిల్లా యంత్రాంగం అప్రమత్తమై వైద్యశాఖ, రెవెన్యూ, పంచాయతీ అధికారులకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి కొరత తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా వడగాల్పుల నుంచి రక్షణ చర్యలు పాటించాలని, అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప వైద్యశాలను సంప్రదించాలని సూచించారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..