కప్పర్ల వాసి తేలు గంగయ్యగా గుర్తింపు
ఆత్మహత్యగా అనుమానం.. కారణాలపై దర్యాప్తు
మన భారత్, తాంసి :
తాంసి మండలంలోని మత్తడి వాగు ప్రాజెక్టులో వ్యక్తి మృతదేహం లభ్యమవడంతో స్థానికంగా కలకలం రేగింది. మృతుడు కప్పర్ల గ్రామానికి చెందిన తేలు గంగయ్యగా గుర్తించారు. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన గంగయ్య బుధవారం ప్రాజెక్టు నీటిలో మృతదేహంగా తేలినట్లు సమాచారం.
ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి మొదట గుర్తు తెలియని వ్యక్తిగా నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
గురువారం సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు రిమ్స్ ఆస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని గంగయ్యదేనని ధృవీకరించారు. కుటుంబ సభ్యుల రోదనలు అక్కడ విషాద వాతావరణాన్ని నెలకొల్పాయి.
ప్రాథమిక సమాచారం ప్రకారం గంగయ్య ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, మృతికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
గ్రామంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురి చేసింది. గంగయ్య మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
