అధ్యక్షుడిగా అచ్చిబాబు ఎంపిక
ఘనంగా ప్రమాణ స్వీకారం
మన భారత్, ధన్వాడ :
ధన్వాడ మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ అధ్యక్షుడిగా అచ్చిబాబు ఎన్నిక కాగా, ఉపాధ్యక్షుడిగా సాయిబాబా, ప్రధాన కార్యదర్శిగా సందరాజు ఎన్నికయ్యారు.
ఈ నెల 16న మత్స్య కార్మిక సహకార సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ, ఎన్నికల పోటీ అవసరం లేకుండా మత్స్య కార్మిక పెద్దలు పరస్పర చర్చల అనంతరం ఏకగ్రీవ ఎన్నికలపై నిర్ణయం తీసుకున్నారు. సంఘ ఐక్యతను కాపాడుతూ కమిటీని ఏకగ్రీవంగా ఎంపిక చేయడం విశేషంగా నిలిచింది.
డైరెక్టర్లుగా చింతకాయల బాలయ్య, సంధ బాలరాజు, రాములు, నీరటి బాబా, చెట్టుకింద అశ్విని మరియు సంద మంజులులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా ఎన్నికల అధికారి అచ్చిబాబును అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించి నియామక పత్రాన్ని అందజేశారు. నూతన కార్యవర్గ సభ్యులకు స్థానిక మత్స్యకారులు అభినందనలు తెలిపారు.
ఎన్నికైన కమిటీ సభ్యులు శుక్రవారం ఘనంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.
మత్స్యకారుల సంక్షేమం, ఉపాధి అవకాశాల విస్తరణ, చేపల ఉత్పత్తి పెంపు, ప్రభుత్వ పథకాల సమర్థ అమలు దిశగా నూతన కమిటీ కృషి చేయాలని స్థానిక మత్స్యకారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
