manabharath.com
Newspaper Banner
Date of Publish : 14 May 2026, 2:54 am Editor : manabharath

మత్తడి ప్రాజెక్టులో గుర్తుతెలియని మృతదేహం..

మన భారత్, తాంసి

గేట్ల సమీపంలో తేలిన మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు

ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని వడ్డాడి మత్తడి వాగు ప్రాజెక్టులో బుధవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ విషయాన్ని స్టేషన్ ఇన్‌చార్జ్ ఎస్‌ఐ రాధిక వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రాజెక్టు గేట్ల సమీపంలో నీటిలో మృతదేహం కనిపించడంతో అటుగా వెళ్తున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం గజ ఈతగాళ్ల సహాయంతో నీటిలో ఉన్న మృతదేహాన్ని బయటకు తీశారు.

మృతుడు లైనింగ్ షార్ట్, ప్యాంట్ ధరించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదని తెలిపారు. సంఘటన స్థలంలో పంచనామా నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడు ఎవరు? ఏ పరిస్థితుల్లో ప్రాజెక్టులోకి చేరాడు? ప్రమాదవశాత్తూ మృతి చెందాడా? లేక ఇతర కారణాలున్నాయా? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

స్థానిక ప్రాంతాల్లో ఎవరైనా వ్యక్తులు కనిపించకపోతే సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు ప్రజలకు సూచించారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..