manabharath.com
Newspaper Banner
Date of Publish : 14 May 2026, 1:46 am Editor : manabharath

విద్యుత్ వైర్లు తెగి అగ్ని ప్రమాదం..

మన భారత్, మొగుళ్లపల్లి

రెండెకరాల మొక్కజొన్న పంట దగ్ధం.. సర్పంచ్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పోతుగల్లు గ్రామంలో విద్యుత్ వైర్లు తెగిపడటంతో మొక్కజొన్న పంట చేనులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన నేరెళ్ల సుధాకర్‌కు చెందిన సుమారు రెండెకరాల మొక్కజొన్న పంట పూర్తిగా అగ్నికి ఆహుతైంది. చేతికొచ్చిన పంట కళ్లముందే కాలిపోతుండటంతో రైతు బోరున విలపించాడు.

వేసవి తీవ్రత, వడగాలుల కారణంగా మంటలు వేగంగా వ్యాపించే పరిస్థితి ఏర్పడగా, గ్రామ సర్పంచ్ ఎలిగేటి తిరుపతి వెంటనే అప్రమత్తమై గ్రామ ప్రజలను సమీకరించారు. స్థానికుల సహకారంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చి మరింత నష్టం జరగకుండా కృషి చేశారు. సర్పంచ్ సమయస్ఫూర్తితో స్పందించకపోతే గ్రామంలో మరింత పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉండేదని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.

అగ్నిప్రమాదంతో తీవ్రంగా నష్టపోయిన రైతు కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సర్పంచ్ ఎలిగేటి తిరుపతి డిమాండ్ చేశారు. గ్రామ ప్రజల భద్రత కోసం సర్పంచ్ తీసుకుంటున్న చర్యలను ప్రజలు, అధికారులు అభినందిస్తున్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..