manabharath.com
Newspaper Banner
Date of Publish : 13 May 2026, 4:18 am Editor : manabharath

హిందూ బంధువులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

మన భారత్, మొగుళ్లపల్లి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలానికి చెందిన బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ హనుమాన్ జయంతి సందర్భంగా దేశంలోని హిందూ బంధువులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలోని శ్రీ రాముల వారి ఆలయాన్ని సందర్శించిన ఆయన, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు సమర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, హనుమంతుడు బలం, భక్తి, బుద్ధికి ప్రతీకగా నిలిచిన మహానుభావుడని కొనియాడారు. హనుమంతుని జన్మ విశేషాలు, చరిత్ర ప్రతి హిందువు తెలుసుకోవాల్సిన అంశమని అన్నారు. పుంజికస్థల అనే అప్సరస శాపవశాత్తు అంజనగా జన్మించి, వానర రాజు కేసరిని వివాహం చేసుకుందని, శివుని అంశంతో, వాయుదేవుని ఆశీస్సులతో అంజనాదేవికి హనుమంతుడు జన్మించాడని వివరించారు. అందుకే హనుమంతుడిని అంజనా సుతుడు, వాయుపుత్రుడు అని పిలుస్తారని తెలిపారు.

బాల్యంలో ఆకలితో ఉన్న హనుమంతుడు సూర్యుడిని పండుగా భావించి ఆకాశంలోకి ఎగిరాడని, అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో హనుమంతుని దవడపై కొట్టడంతో ఆయనకు “హనుమంతుడు” అనే పేరు వచ్చిందని వివరించారు. సంస్కృతంలో దవడను “హను” అని పిలుస్తారని, దవడకు గాయం కావడం వల్లే ఆ పేరు ఏర్పడిందన్నారు.

హనుమంతుడు చిరంజీవుల్లో ఒకరని, శ్రీరాముడి పట్ల అపారమైన భక్తి, సేవాభావం కలిగిన మహా వీరుడని మహేందర్ గౌడ్ పేర్కొన్నారు. లంకలో సీతమ్మను కనుగొనడం నుంచి రావణాసురునిపై యుద్ధంలో శ్రీరాముడికి అండగా నిలిచే వరకు హనుమంతుడు కీలకపాత్ర పోషించాడన్నారు.

హనుమంతుడు అపారమైన శక్తి, అష్టసిద్ధులు, నవనిధుల వరాలు పొందిన మహా జ్ఞాని అని, సర్వశాస్త్ర పారంగతుడని కొనియాడారు. ఈ పవిత్ర రోజున ఆంజనేయస్వామిని దర్శించుకోవడం, హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల భయాలు తొలగి, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని తెలిపారు.

ప్రజలందరూ సుఖసంతోషాలతో, పాడిపంటలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, శ్రీరాముడు మరియు ఆంజనేయస్వామి కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించినట్లు మహేందర్ గౌడ్ పేర్కొన్నారు.


మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి…