manabharath.com
Newspaper Banner
Date of Publish : 13 May 2026, 3:40 am Editor : manabharath

లక్ష్మీపూర్ చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

మన భారత్, ఆదిలాబాద్ జిల్లా తలమడుగు: బక్రీద్ పండుగ నేపథ్యంలో జిల్లాలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసిన పోలీసులు ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని లక్ష్మీపూర్ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మంగళవారం పరిశీలించారు.

జిల్లా వ్యాప్తంగా మొత్తం ఏడు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా లక్ష్మీపూర్ చెక్‌పోస్ట్‌ను సందర్శించిన ఎస్పీ అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు.

చెక్‌పోస్ట్ వద్దకు వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, అక్రమ పశువుల రవాణాను పూర్తిగా అడ్డుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా పశువులను తరలిస్తున్న వాహనాలకు సంబంధించిన పత్రాలను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. అనుమానాస్పదంగా కనిపించే వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని తెలిపారు.

పోలీసు సిబ్బంది 24 గంటలు షిఫ్ట్ విధానంలో విధులు నిర్వహిస్తూ ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ స్పష్టం చేశారు. వాహన తనిఖీల సమయంలో అనుమానాస్పదంగా పారిపోయే వాహనాల సమాచారాన్ని వెంటనే ఉన్నతాధికారులకు చేరవేయాలని సూచించారు.

బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతలు కాపాడటానికి పోలీసులు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నారని ఎస్పీ తెలిపారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ కె. ఫణిదర్, తలమడుగు ఎస్ఐ డి. రాధికతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..