మన భారత్, హైదరాబాద్:
హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ మరియు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య జరిగిన ఆత్మీయ సంభాషణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హెచ్ఐసీసీ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో ఇద్దరు నేతలు పక్కపక్కనే కూర్చొని నవ్వుతూ ముచ్చటించుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.
కార్యక్రమం సందర్భంగా ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి వెండి నంది జ్ఞాపికను అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఇద్దరు నాయకులు కొద్దిసేపు సరదాగా మాట్లాడుకున్నట్లు అక్కడ ఉన్నవారు తెలిపారు. ఈ క్రమంలో “కాంగ్రెస్లో ఉంటే ఎక్కడ ఉన్నావో అక్కడే ఉంటావు.. బీజేపీలోకి వచ్చేయ్.. మంచి స్థాయిలో ఉంచుతా” అంటూ ప్రధాని మోదీ సరదాగా వ్యాఖ్యానించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఈ వ్యాఖ్యలపై అధికారిక ధృవీకరణ లేకపోయినా, సభలో చోటుచేసుకున్న ఈ సన్నివేశం రాజకీయ ఆసక్తిని పెంచింది. ఒకవైపు రాజకీయంగా విభిన్న పార్టీలకు చెందిన నేతలు అయినప్పటికీ, మరోవైపు రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర-రాష్ట్ర సంబంధాల పరంగా ఇద్దరూ ఆత్మీయంగా వ్యవహరించడం విశేషంగా నిలిచింది.
కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగంగా అమలు అవుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, పెట్టుబడుల ఆకర్షణలో కేంద్ర సహకారం కీలకమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
హెచ్ఐసీసీ కార్యక్రమంలో మోదీ, రేవంత్ రెడ్డి మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ ప్రజల ముందుకు స్నేహపూర్వకంగా రావడం మంచి పరిణామమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
