manabharath.com
Newspaper Banner
Date of Publish : 10 May 2026, 12:29 pm Editor : manabharath

చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎస్సై..

మన భారత్, ఆదిలాబాద్:

వేసవి కాలంలో రోజురోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఆదిలాబాద్ పట్టణంలోని వినాయక్ చౌక్ సమీపంలో New Rainbow Voluntary Organization ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. ప్రజలకు చల్లని తాగునీరు అందించే ఈ సేవా కార్యక్రమానికి స్థానికులు అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ 1 టౌన్ ఎస్‌ఐ నాగనాథ్ హాజరై రిబ్బన్ కట్ చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా యువత మంచి గుర్తింపు పొందగలదని పేర్కొన్నారు.

అలాగే న్యూ రెయిన్బో సంస్థ చేపడుతున్న వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను ఆయన అభినందించారు. ప్రజల అవసరాలను గుర్తించి వేసవి కాలంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. సేవా కార్యక్రమాలు సమాజంలో మానవత్వాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.

ఈ సందర్భంగా సంస్థ జిల్లా అధ్యక్షులు కొమ్ము రాము మాట్లాడుతూ ఎండల తీవ్రత కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా చల్లని తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా పలు సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు రొడ్డ భాగవండ్లు, తోట విజయ్ కుమార్, రవి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..