manabharath.com
Newspaper Banner
Date of Publish : 10 May 2026, 3:10 am Editor : manabharath

మిషన్ భగీరథ అధికారులు ఎక్కడ..?

– ధన్వాడలో తాగునీటి సమస్యపై ప్రజల ఆగ్రహం

– ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ తీరుపై విమర్శలు

మన భారత్, ధన్వాడ:
ధన్వాడ మండలంలో నెలకొన్న తాగునీటి సమస్యపై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథ అధికారులు, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు సమస్యలను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వేసవి కాలం ప్రారంభమైనప్పటి నుంచే మండలంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ, అధికారులు మాత్రం స్పందించడంలేదని ప్రజలు మండిపడుతున్నారు.

జిల్లా కలెక్టర్‌తో పాటు ఉన్నతాధికారులు ఎక్కడ తాగునీటి సమస్య ఉన్నా వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ధన్వాడ మండలంలో మాత్రం ఆ ఆదేశాలు అమలుకావడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మండల కేంద్రంలోని పలు వార్డుల్లో ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నా సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ధన్వాడలోని పదో వార్డులో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని గ్రామపంచాయతీలో పలుమార్లు తీర్మానాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని ప్రజలు చెబుతున్నారు. గత నెలలో మిషన్ భగీరథ అధికారులు సమస్య ఉన్న ప్రాంతాన్ని సందర్శించి, 15 రోజుల్లో నీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, అయితే నెల రోజులు గడిచినా ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ప్రస్తుతం ఆ ప్రాంతంలో తాగునీటి సమస్య యథాతథంగానే కొనసాగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని మహిళలు వాపోతున్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందుండాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం సమస్యను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు.

ఇదే పరిస్థితి కొనసాగితే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ప్రజలు హెచ్చరిస్తున్నారు. అందుబాటులో లేని ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని, తక్షణమే ధన్వాడలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..