manabharath.com
Newspaper Banner
Date of Publish : 09 May 2026, 6:45 am Editor : manabharath

మేలు జాతి దూడల ప్రదర్శన..

మన భారత్, తలమడుగు:
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా తలమడుగు మండలంలోని కుచూలాపూర్ గ్రామంలో శుక్రవారం ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో పశుసంవర్ధక రంగాన్ని అభివృద్ధి చేయడం, పశువుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

పశువైద్యాధికారి డాక్టర్ లావణ్య పర్యవేక్షణలో నిర్వహించిన ఈ శిబిరంలో చూలు కట్టని, ఎదకు రాని పశువులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించారు. పశువుల గర్భకోశ సంబంధిత వ్యాధుల నివారణకు అవసరమైన మందులు అందజేసి రైతులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మేలు జాతి దూడల ప్రదర్శన రైతులను విశేషంగా ఆకట్టుకుంది. మంచి జాతి పశువుల పెంపకం ద్వారా పాల ఉత్పత్తి పెరగడంతో పాటు రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని అధికారులు వివరించారు. పశుసంవర్ధక రంగంలో ఆధునిక పద్ధతులను రైతులు అనుసరించాలని సూచించారు.

డాక్టర్ లావణ్య మాట్లాడుతూ పశువుల ఆరోగ్యంపై రైతులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. పశువులకు సమయానికి టీకాలు వేయించడం, సరైన పోషకాహారం అందించడం, శుభ్రమైన పరిసరాల్లో ఉంచడం ద్వారా వ్యాధులను నివారించవచ్చని చెప్పారు. పశువులలో ఏవైనా ఆరోగ్య సమస్యలు కనిపించిన వెంటనే సమీప పశువైద్యశాలను సంప్రదించాలని సూచించారు.

గ్రామీణ ప్రాంతాల్లో పశుసంవర్ధక రంగం రైతులకు ప్రధాన ఆదాయ వనరుగా మారుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని అధికారులు తెలిపారు. ఈ తరహా వైద్య శిబిరాల ద్వారా రైతులకు అవగాహన కల్పించడంతో పాటు పశువుల ఆరోగ్య సంరక్షణకు సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, రైతులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకులు సర్పంచ్ మోడేపు వెంకన్నతో పాటు పశుసంవర్ధక శాఖ సిబ్బంది పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేశారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..