మన భారత్, శృంగవరపుకోట నియోజకవర్గం:
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని త్వరితగతిన పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి స్పష్టం చేశారు. శృంగవరపుకోట నియోజకవర్గ పరిధిలోని లక్కవరపుకోట టిడిపి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజాదర్బార్’ కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. మొత్తం 38 వినతులు అందగా, అందులో ప్రధానంగా పెన్షన్లకు సంబంధించిన 23 అర్జీలు, ఇళ్ల స్థలాల కోసం 10 దరఖాస్తులు ఉండగా, మరికొన్ని వ్యక్తిగత సమస్యలకు సంబంధించినవిగా గుర్తించారు.
ప్రజలతో నేరుగా ముఖాముఖి నిర్వహించిన ఎమ్మెల్యే ప్రతి సమస్యను శ్రద్ధగా విని, సంబంధిత అధికారులతో చర్చించి వెంటనే పరిష్కార మార్గాలు చూపించాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారమే తమ పరమావధి అని తెలిపారు. ఏ ఒక్క పేదవాడు ప్రభుత్వ సాయానికి దూరం కాకూడదనే ఉద్దేశంతో గ్రామ స్థాయిలోనే సమస్యలను గుర్తించి పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పారదర్శక పాలన అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తమ ధ్యేయమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అధికారులు ప్రజాప్రతినిధులతో సమన్వయంతో పనిచేసి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. ప్రజాదర్బార్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు ప్రభుత్వంపై మరింత విశ్వాసం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
స్థానిక నాయకులు, అధికారులు, గ్రామస్తులు, మహిళలు, యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమం ప్రజల స్పందనతో ఉత్సాహభరితంగా సాగింది.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
