manabharath.com
Newspaper Banner
Date of Publish : 05 May 2026, 6:24 am Editor : manabharath

22 ఏళ్లకే 10 ప్రభుత్వ ఉద్యోగాలు..!

మన భారత్, విజయవాడ:

ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంటే ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. ఎన్నో సంవత్సరాల కృషి, పట్టుదల, సమయపాలన అవసరం. అయినప్పటికీ విజయం ఖాయం అవుతుందన్న హామీ ఉండదు. అలాంటి పోటీ ప్రపంచంలో కేవలం 22 ఏళ్ల వయసులోనే పది ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది విజయవాడకు చెందిన గంటె సుజితశ్రీ. ఆమె విజయం ఇప్పుడు యువతకు స్ఫూర్తిదాయకంగా మారింది.

సుజితశ్రీ కుటుంబ నేపథ్యం సాధారణమే. తండ్రి మోహనరావు ప్రైవేట్ ఉద్యోగి కాగా, తల్లి కృష్ణవేణి గృహిణి. అన్నయ్య జస్వంత్ విదేశాల్లో ఎంఎస్ చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచే తన కుమార్తె ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడాలని తండ్రి కలగన్నారని, అదే లక్ష్యంగా పెట్టుకుని తాను కృషి ప్రారంభించానని సుజితశ్రీ చెబుతోంది. కుటుంబం కోసం ఎంతో కష్టపడుతున్న తండ్రి ఆశలను నెరవేర్చాలని తాను సంకల్పించుకున్నట్లు పేర్కొంది.

పీవీపీ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేసిన ఆమెకు క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ప్రైవేట్ ఉద్యోగం కూడా లభించింది. అయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యమని భావించి ఆ అవకాశాన్ని వదులుకుని పూర్తిస్థాయిలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యింది. 2024 నుంచి ప్రణాళికాబద్ధంగా చదువులు ప్రారంభించి, స్థానికంగా ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్‌లో చేరి క్రమశిక్షణతో శిక్షణ తీసుకుంది.

ప్రతి రోజు ఇన్స్టిట్యూట్‌లో మూడు గంటలు చదివి, ఇంటికి వచ్చాక మరో నాలుగు గంటలు స్వయంగా సాధన చేసేది. అంకగణితం, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ వంటి అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. అధ్యాపకుడు కొమ్మూరి శ్రీధర్ మార్గదర్శకత్వంలో షార్ట్‌కట్ పద్ధతులు, టైమ్ మేనేజ్‌మెంట్, ప్రశ్నల ఎంపిక వంటి కీలక మెలకువలను నేర్చుకుని తన సిద్ధతను మెరుగుపరుచుకుంది.

ఈ క్రమంలోనే ఆమెకు వరుస విజయాలు దక్కాయి. ఇండియన్ బ్యాంక్, ఐడీబీఐ, ఆప్కాబ్, ఎస్బీఐ వంటి బ్యాంకుల్లో జూనియర్ అసిస్టెంట్, అప్రెంటిస్ వంటి పదవులకు ఎంపికైంది. అంతేకాకుండా ఎన్ఐసీలో గెజిటెడ్ హోదా కలిగిన ఏఏవో ఉద్యోగానికి కూడా ఎంపికై మరింత ప్రతిభ చాటింది. ప్రస్తుతం ఏఏవోగా విధులు నిర్వర్తించేందుకు సిద్ధమవుతోంది.

సుజితశ్రీ తన విజయ రహస్యాన్ని మన భారత్ కు వివరిస్తూ, “ఇష్టంతో నేర్చుకుంటే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చు. ఓర్పు, పట్టుదల ఉంటే ఆలస్యమైనా విజయం ఖాయం. ప్రతిరోజూ క్రమంగా ప్రాక్టీస్ చేస్తూ ముందుకు సాగితేనే ఫలితం లభిస్తుంది” అని సూచించింది.

ఇప్పటి పోటీ యుగంలో లక్ష్యసాధనకు క్రమశిక్షణ, నిరంతర సాధన ఎంత ముఖ్యమో ఆమె విజయం మరోసారి చాటింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వేలాది మంది అభ్యర్థులకు సుజితశ్రీ సక్సెస్ స్టోరీ ప్రేరణగా నిలుస్తోంది.


మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..